హైదరాబాద్ అంబర్ పేట సమీపంలో అనుమతి లేకుండా నడుస్తున్న బొగ్గు డిపోను అటవీ శాఖ సీజ్ చేసింది. స్థానికంగా నిత్యం బొగ్గు వ్యాపారం జరుగుతోందని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు వెళ్లి తనిఖీ చేశారు. అబ్దుల్ అలీమ్ అనే వ్యక్తి సాగర్ చార్ కోల్ డిపో పేరుతో అక్కడ అనుమతిలేని బొగ్గు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే నిత్యం మహారాష్ట్ర నుంచి లారీల్లో బొగ్గు ఇక్కడికి తరలిస్తున్నట్లు అటవీ శాఖ పరిశీలనలో వెల్లడైంది.
బొగ్గు లోడ్ తో అక్కడే ఆగి ఉన్న మహారాష్ట్రకు చెందిన లారీని కూడా అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. సామిల్ (కట్టెకోత మిషన్) పేరుతో అనుమతి తీసుకుని నిర్వాహకులు బొగ్గు డిపోను కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఎలాంటి అగ్ని ప్రమాద నిరోధకాలను సైతం నిర్వాహకులు ఏర్పాటుచేయలేదు. సంబంధిత వ్యక్తులపై అటవీ శాఖ కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు హైదరాబాద్ డీఎఫ్ఓ జోజి తెలిపారు.